ప్రొద్దుటూరులో ఆర్టీఐ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: తహసీల్దార్కు ఆర్సీపీ వినతి
ప్రొద్దుటూరు, (b10vartha ప్రతినిధి):
ప్రొద్దుటూరు మండలంలోని అన్ని ప్రభుత్వ, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం (RTI)-2005ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ (RCP) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్సీపీ డివిజన్ కార్యదర్శి ఎస్.ఎం. షరీఫ్ ఆధ్వర్యంలో నాయకులు స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్.ఎం. షరీఫ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సమాచారం పొందడం సెక్షన్ 3 ప్రకారం ప్రతి పౌరుని హక్కు అని, మండల స్థాయిలో దీని అమలు బాధ్యత తహసీల్దార్దేనని గుర్తుచేశారు. ఈ చట్టం అమలు కోసం ఆయన పలు ప్రధాన డిమాండ్లను అధికారుల ముందు ఉంచారు:
ప్రధాన డిమాండ్లు:
బోర్డుల ఏర్పాటు: ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా సిటిజన్ చార్టర్, RTI సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలి.
తెలుగులో సమాచారం: సెక్షన్ 4(1)(బి) లోని 17 అంశాల సమాచారాన్ని తెలుగులో ముద్రించి, దరఖాస్తుదారులకు స్వచ్ఛందంగా అందించాలి.
సమయపాలన: దరఖాస్తు చేసుకున్న వారికి సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలి. పౌర సమాచార అధికారులు జాప్యం చేస్తే సెక్షన్ 7(6) కింద ఉచితంగా సమాచారం అందజేయాలి.
రిజిస్టర్ల నిర్వహణ: ఆర్టీఐ దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా రిజిస్టర్-1, 2 లను పక్కాగా నిర్వహించాలి.
నెలవారీ తనిఖీలు: ప్రతి నెలా తహసీల్దార్ ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేస్తూ.. దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలి.
అవగాహన: సెక్షన్ 26 ప్రకారం ప్రజలకు సమాచార హక్కు చట్టంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
మండల పరిపాలనా అధికారిగా తహసీల్దార్ తక్షణమే స్పందించి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ మేరకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేయాలని షరీఫ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీ నాయకులు యోవాన్, అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments